హైదరాబాద్,తెలంగాణ కానుక
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డా. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. పార్టీ ఆశయాల సాధనే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చూపుతున్న పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజల మధ్య నిరంతరం ఉంటామని చెప్పారు. యువత, మహిళలు, మేధావులు, సామాజిక సేవకులను పార్టీతో అనుసంధానం చేసి సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రతి డివిజన్, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలను విస్తరించి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడతామని, పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ జిల్లాలో పార్టీ మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు ఉన్న సామాజిక సేవా అనుభవం, నాయకత్వ సామర్థ్యం పార్టీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ భేటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
