హైదరాబాద్ తెలంగాణ కానుక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను టీపీసీసీ ఫిషర్మెన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివాదాలు, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిందన్నారు. అలాంటి పార్టీకి చెందిన నాయకులు ఇప్పుడు నీతులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల మద్దతుతో నిర్మించుకున్న నాయకుడని, ప్రజల్లో తిరిగి, పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కేటీఆర్కు తగదన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్లపై సమాధానం చెప్పాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలపై ప్రజలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమాధానం రాలేదని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడం, ప్రత్యర్థులపై నిఘా పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ముందుగా తమ పాలనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
