హైదరాబాద్, తెలంగాణ కానుక
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.చిరంజీవి అన్నారు. కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి అవిఘ్న వెంకట్రెడ్డి కరాటే ప్రదర్శన ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న సందర్భంగా సోమవారం కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్స్ అతన్ని అభినందించి సత్కరించారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్నిచ్చే ఆటలను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. కార్యక్రమంలో జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి, కళాశాల లెక్చరర్స్ రాంమోహన్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
