“జలమండలి.. బస్తీ బాట..!” కార్యక్రమం భాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తా వద్ద సీవరేజ్ మరమ్మత్తు పనులను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు.
ఈ ప్రాంతంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఘనపదార్థాలు సీవరేజ్ లైన్లలో వదలడంతో మ్యాన్ హోళ్ళు తరచూ పొంగడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డీ-సిల్టింగ్ పనులు చేపట్టినా.. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా గుర్తించలేకపోయారు.
ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి.. నానల్ నగర్ నుంచి మెహిదీపట్నం వైపుగా ఉన్న మ్యాన్ హోళ్ళను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫుట్ పాత్ అనుకుని ఉన్న మాన్ హోళ్లలోకి అక్కడక్కడ చెట్ల వేర్లు చేరి సమస్య పెంచిందని గుర్తించారు. దీంతో తాత్కలిత చర్యగా చెట్ల వేర్లను తొలగించి ధ్వంసమైన మ్యాన్ హోళ్ళను పునర్నిర్మాణం చేయాలని సూచించారు.
అనంతరం లంగర్ హౌజ్, అంబేద్కర్ నగర్ లో తాగునీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడిన ఎండీ.. ప్రశాంత్ నగర్ లో కలుషిత నీటి ఫిర్యాదు పరిష్కార పనులను అధికారులతో సమీక్షించారు.
జోన్-3 పనుల పరిశీలన…
కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకోసం చేపట్టిన జోన్-3 సీవరేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉన్న పనులను, లంగర్ హౌజ్, టోలీ చౌకి ప్రాంతంలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ వినోద్ భార్గవ, సీజీఎం ప్రభు, జిఎంలు శ్రీను నాయక్, ఎస్ కుమార్, ఓఅండ్ఎం, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
