ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతర కాలమంతా నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేసి, మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచినందుకు సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు.
జాతర ముగిసిన తర్వాత కూడా పారిశుధ్య పనులు ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, మేడారంలో పూర్తిస్థాయిలో పరిశుభ్రత సాధించే వరకు శానిటేషన్ సిబ్బంది విధులు కొనసాగించాలని ఆదేశించారు. మేడారానికి రాకపోకలు సాగించిన రహదారులు, పరిసర ప్రాంతాలు గద్దెల ప్రాంగణాలు, భక్తుల బస ప్రాంతాలు పూర్తిగా శుభ్రపడి, స్వచ్ఛమైన మేడారాన్ని గ్రామస్తులకు అప్పగించే వరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, మేడారాన్ని పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. జాతర అనంతరం కూడా అదే బాధ్యతతో పనిచేసి, గ్రామస్తులకు స్వచ్ఛమైన మేడారాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
