లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణా నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణా బయోసైన్సెస్ డైరెక్టర్, సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన సర్వేశ్ సింగ్ సోమవారం నాడు సచివాలయంలో తనను కలిసిన సందర్బంగా ఆయన అభినందనలు తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో మూడో వంతు రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్న విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తు చేసారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు. ఫార్మా ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. జినోమ్ వ్యాలీని మరింత విస్తరించి, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ద్వారాలు తెరుస్తున్నామని చెప్పారు.
