హైడ్రా కమిషనర్ ను కలసి అభినందలు తెలిపిన స్థానికులు
హైదరాబాద్, జూన్ 06: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్ లోని ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలసి అభినందించారు. కబ్జాల పాలవుతున్న చెరువును కాపాడి సకల జీవకోటికి ప్రాణం పోశారంటూ పేర్కొన్నారు. చుట్టూ ఎత్తయిన అపార్ట్మెంట్లు.. మధ్యలో ఉన్న ఏకైక చెరువు కబ్జాల పాలవుతోందని తామంతా ఆందోళన చెందామని.. హైడ్రా చెరువును రక్షించడంతో ఊపిరిపోసుకున్నామన్నారు. 52.20 ఎకరాల పరిధిలో ఉన్న చెరువులో 35.10 ఎకరాలు కబ్జాలకు గురి అయిపోతుంటే హైడ్రా రంగంలోకి దిగి కాపాడింది అని అన్నారు. చెరువు FTL పరిధిలో గుడిసెలు వేయించి ఆ స్థలాన్ని కాజేయాలనుకున్న వారి ప్రయత్నాలకు హైడ్రా అడ్డుకట్ట వేసిందన్నారు. 52.20 ఎకరాల మేర చెరువును అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు హైడ్రాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతూ హైడ్రాను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వరాలుగా నగర చెరువులను ఇవ్వాలని చూడడం అభినందనీయమన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించే హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం అని కొనియాడారు. ఈ చెరువును కాపాడాలని సంతకాల సేకరణ చేపట్టడమే కాదు కొన్నేళ్లుగా పోరాడుతున్నామని.. ఆ పోరాట ఫలితం హైడ్రా ద్వారా సాకారం అయ్యిందని నార్సింగ్ ప్రాంత నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. ముష్కిన్ చెరువు FTL నిర్ధారించి ఆ మేరకు ఫెన్సింగ్ వేయడం.. హైడ్రా అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు.
