తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం.. తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా సాగింది.
తెలంగాణలోని పెట్టుబడి అనుకూలమైన విధానాలను జితేందర్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒమన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ నుంచి గ్రానైట్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులను ఒమన్కు ఎగుమతి చేయడంపై సానుకూల చర్చలు జరిగాయి.
తెలంగాణ, ఒమన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంచేందుకు.. తెలంగాణ, ఒమన్ జట్ల మధ్య స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించాలని.. ఏ.పీ.జితేందర్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ సానుకూలంగా స్పందించారు.
ఒమన్లో నివసిస్తున్న తెలంగాణ వలస కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా చర్చించారు.
తెలంగాణ పారిశ్రామిక వృద్ధిని అభినందించిన ఇస్సా సలేహ్ అల్ షిబానీ.. త్వరలోనే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలతో తదుపరి చర్చలు జరుపుతామని చెప్పారు.ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఒమన్ వంటి దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఏర్పడటం వల్ల.. ఇరుపక్షాలకు ఆర్థికంగా, సాంస్కృతికగా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది” అని వ్యాఖ్యానించారు.
