టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తో కలిసి ప్రసారాల వివరాలు తెలిపే షెడ్యూల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎడ్ సెట్ లో ఉన్నతమైన ర్యాంకులు సాధించేందుకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా బీఈడీ సీటుకోసం విద్యార్థులు మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
టి-సాట్ కంటెంట్ శాటిలైట్ టెలికాస్ట్ తో పాటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వార అందుబాటులో ఉంటుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. తెలంగాణా ప్రభుత్వం నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, మే నెలలో జరిగే ఎడ్ సెట్ పరీక్ష కోసం అభ్యర్థులను సిద్ధం చేసేందుకు పిబ్రవరి రెండవ తేది నుండి మే 11వ తేది వరకూ నాలుగు గంటల పాటు 392 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు .బయాలజీ, పిజికల్ సైన్స్, మాథమేటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులతో 98 రోజుల పాటు టి-సాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యబ్ లో ప్రసారాలు కొనసాగుతాయి.
పోటీ పరీక్షలకు డిజిటల్ కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్న సీఈవో వేణుగోపాల్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి-సాట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్ ఎం.డి సాధిక్ పాల్గొన్నారు.
