ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే సాయం అందించి.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆపద మిత్ర శిక్షణను జిల్లా, గ్రామ స్థాయికి విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. ఇందుకు మొబైల్ వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవడమే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. ఆపద సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడం.., ప్రాణాలు కాపాడడం సాధారణ విషయం కాదని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. సేవ చేయాలనే ఆలోచనే మిమ్ములను యువ ఆపద మిత్రలను చేసిందన్నారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 103 మంది విద్యార్థులు హాజరుకావడం ఎంతో ఆనందకరమన్నారు. మన గురించి, మన కుటుంబం కోసమే కాకుండా.. మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించే భావం నిత్యం ఉండాలని సూచించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని యువ ఆపద మిత్రులు ఇవ్వాలన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సుతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేసేందుకు అందుబాటులో ఉండేది యువ ఆపద మిత్రులన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఆపద మిత్రులకు ధ్రువపత్రాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అందజేశారు.
హైడ్రా సేవలు విస్తరించాలి…
అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు.., ఎలా బయట పడగలం, వరదలు వస్తే ఎలా కాపాడాలి, గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్ననప్పుడు సీపీఆర్ విధానం గురించి ఈ వారం రోజుల శిక్షణలో తెలుసుకున్నామని పలువురు యువ ఆపద మిత్ర వాలంటీర్లు ఈ సందర్భంగా చెప్పారు. శిక్షణలో ప్రాక్టికల్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా అవగాహన వచ్చిందని.. మరికొంతమందికి నేర్పుతామని విద్యార్థులు చెప్పారు. హైడ్రా సేవలు హైదరాబాద్కే కాకుండా.. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ప్రకృతి పరిరక్షణ సాధ్యమని పలువురు విద్యార్థులు ఈ సందర్బంగా కోరారు. వారం రోజుల శిక్షణలో భాగంగా హైడ్రా కార్యకలాపాలపై కూడా పూర్తి అవగాహన వచ్చిందన్నారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ శ్రీ ఆర్. సుదర్శన్ గారు, అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్యగారు. హైడ్రా ఆర్ఎఫ్ఓ శ్రీ జయప్రకాశ్, డీపీవోలు శ్రీ యజ్ఞ నారాయణ, శ్రీ గౌతమ్, ఏడీఎఫ్వో శ్రీ మోహనరావు, శ్రీ శ్యామ్మోహన్, ఇన్స్పెక్టర్ షంషుద్దీన్, ఎన్డీఎంఏ కన్సల్టెంట్ డా. గౌతమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
