వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఇంటి యజమాని మరణిస్తే ఎంత ఆవేదనకు గురవుతారో ఆలోచించాలన్నారు. ఏటా అనారోగ్యాల కారణంగా మరణించే వారి సంఖ్య కన్నా రహదారి ప్రమాదాల్లో మృతి చెందే వారే ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రహదారి భద్రతపై చాలామందికి అవగాహన లేకపోవడం, నిర్లక్ష్య డ్రైవింగ్ తో ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా జనవరి నెల మొత్తం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ప్రజలు రహదారి నియమాలను పాటిస్తూ, సురక్షిత ప్రయాణాలు చేసేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్టిఓ కృష్ణారెడ్డి, ఎంవీఐ రాములు, వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
