వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి:సీపీ సజ్జనర్.

Spread the love

నూతన సంవత్సర వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో జరుపుకోవాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్ గురువారం నిరాడంబరంగా గడిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కర్ఖానలోని ఆర్కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించారు.

అక్కడ ఆశ్రయం పొందుతున్న 48 మంది వృద్ధులకు పోలీస్ అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, వారితో కాసేపు ఆత్మీయంగా గడిపారు. కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

నెల రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలను తిరుమలగిరి ఏసీపీ రమేష్‌ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీ సజ్జనర్‌.. మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంలో చికిత్స పొందుతున్న పావలా శ్యామలను సీపీ ఆత్మీయంగా పలకరించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వృద్ధులను అక్కున చేర్చుకుని, గత 18 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఫౌండేషన్‌ నిర్వహకుడు డాక్టర్ రామకృష్ణను అభినందించారు.

కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని స్పష్టం చేశారు. ఆధునిక జీవనశైలి, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడి సాకుతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం సరికాదన్నారు.

మనల్ని పెంచి పెద్ద చేసిన వారి త్యాగాలను విస్మరించవద్దని, వృద్ధాప్యంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు.. కేవలం పిల్లల ఆప్యాయత మాత్రమేనని గుర్తుచేశారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా, దైవంగా భావించి పూజించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేష్, కార్ఖానా ఇన్‌స్పెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *