మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గద్వాల్, అయిజ,వడ్డేపల్లి, అలంపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని తెలిపారు.డిసెంబర్ 1, 2025 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.ప్రతి ఓటర్ను వారి నివాస భౌగోళిక పరిధి, ఇంటి నంబర్ మరియు వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలని అధికారులకు సూచించారు.ఒక ఓటర్కు ఒకే ఓటు హక్కు ఉంటుందని, గ్రామపంచాయతీలో ఉన్న ఓటర్లు మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒకేసారి రెండు చోట్ల ఓటర్గా నమోదు ఉండకూడదని తెలిపారు. ఒక వార్డులో ఉండి ఇంకొక వార్డులో ఉన్న ఓట్లను పరిశీలించి సరి చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ జాబితాలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గద్వాల్ మున్సిపాలిటీలోని 13,16,17 వార్డులకు సంబంధించిన అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పులు లేని ఓటర్ జాబితా రూపొందించి పురపాలక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
